
5


3వ పుట్టినరోజుకు కానిస్టేబుల్ 53 కిలోమీటర్ల సైక్లింగ్..
ఆరోగ్యం.. ఫిట్నెస్.. పర్యావరణ పరిరక్షణకు వినూత్న సందేశం..
రాజగోపాల పేట పోలీస్ కానిస్టేబుల్ నీలం సంపత్కు ఎస్ఐ వివేక్, సిబ్బంది అభినందనలు..
సిద్దిపేట టైమ్స్, నంగునూరు, సెప్టెంబర్ 3:
పుట్టిన రోజును కేవలం వేడుకలకే పరిమితం చేయకుండా సమాజానికి ఉపయోగపడే సందేశాన్ని అందిస్తూ వినూత్నంగా జరుపుకున్నారు. రాజగోపాల్పేట పోలీస్స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ నీలం సంపత్. గురువారం తన 53వ పుట్టినరోజు సందర్భంగా తన వయస్సుకు గుర్తుగా 53 కిలోమీటర్ల సైక్లింగ్ చేపట్టి ఆరోగ్యం, ఫిట్నెస్, క్రమశిక్షణతో పాటు పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను చాటిచెప్పారు.
హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు సమీపంలోని గ్లాస్ బ్రిడ్జి నుంచి సిద్దిపేట వరకు సుమారు 53 కిలోమీటర్ల మేర సైకిల్పై ప్రయాణించిన సంపత్.. తన పుట్టినరోజును ప్రత్యేకంగా మలుచుకున్నారు. వాహనాల వినియోగాన్ని తగ్గించి సైక్లింగ్ను ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కూడా తన వంతు సందేశాన్ని అందించారు.
ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో పెరుగుతున్న ఒత్తిడి, జీవనశైలి సంబంధిత ఆరోగ్య సమస్యల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ కొంత సమయం శారీరక వ్యాయామానికి కేటాయించాలని సంపత్ సూచించారు. సైక్లింగ్ వంటి వ్యాయామాలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కూడా అందిస్తాయని తెలిపారు.
“వయస్సు ఆరోగ్యానికి అడ్డంకి కాదు.. ఆరోగ్యంపై శ్రద్ధ, క్రమశిక్షణ ఉంటే ఏ వయస్సులోనైనా ఫిట్గా ఉండవచ్చు” అనే సందేశాన్ని తన 53 కిలోమీటర్ల సైక్లింగ్ ద్వారా సంపత్ ఆచరణలో చూపించారు.
పుట్టినరోజు సందర్భంగా సంపత్ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమాన్ని రాజగోపాలపేట ఎస్ఐ వివేక్, పోలీస్ సిబ్బంది అభినందించారు. వ్యక్తిగత వేడుకను ప్రజలకు స్ఫూర్తినిచ్చే కార్యక్రమంగా మార్చడం అభినందనీయమని పేర్కొన్నారు.
కానిస్టేబుల్ నీలం సంపత్ చేసిన ఈ సైక్లింగ్ కార్యక్రమం నంగునూరు మండల ప్రజలకు, ముఖ్యంగా యువతకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. యువతతో పాటు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతూ వ్యాయామం, సైక్లింగ్ వంటి మంచి అలవాట్లను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని కోరారు.



