భ


ూంపల్లిలో తాళం వేసిన ఇంట్లో అగ్ని ప్రమాదం..
సిద్దిపేట టైమ్స్ అక్బరుపేట/భూంపల్లి మే 06
అక్బర్పేట భూంపల్లి మండలం భూంపల్లి గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బొమ్మర శ్రీకర్ ఇంట్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. అదే సమయంలో ఒక్కసారిగా ఇంట్లో మంటలు ఎగసిపడ్డాయి. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో గమనించిన గ్రామస్తులు వెంటనే అప్రమత్తమయ్యారు.
జెసీబీ సహాయంతో డోర్లు పగలగొట్టి, మంటలు ఆర్పేందుకు గ్రామస్తులు స్వయంగా రంగంలోకి దిగారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో ఫైర్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికే… ఇంట్లోని కిరాణం షాపుతో పాటు ఫర్నిచర్, బట్టలు, విలువైన వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్కసారిగా రోడ్డున పడ్డ కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమా? లేక మరేమైనా కారణం ఉందా? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.



