
ప

్రేమ పేరుతో మోసం… ప్రశ్నించగా వివాహితపై
కారం పొడి, రాళ్ల దాడి
దౌల్తాబాద్ మే 06 (సిద్దిపేట టైమ్స్): గజ్వేల్ మండలం బెజుగామ గ్రామానికి చెందిన ఓ మహిళ జీవితాన్ని మూడు సంవత్సరాలుగా సాగిన అక్రమ సంబంధం చిద్రముచేసింది. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం శేరిపల్లి బందారం గ్రామానికి తిప్పణమైన స్వామి అనే వ్యక్తి, భర్త మరియు ఇద్దరు పిల్లలున్న వివాహిత మహిళను ప్రేమ పేరుతో మోసం చేసి, చివరికి ఆమెపై అమానుషంగా దాడి జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే… స్వామి మాటలు నమ్మిన సదరు మహిళ తన కుటుంబాన్ని వదిలి అతనితో సహజీవనం ప్రారంభించింది. మూడు సంవత్సరాల పాటు అతడితో జీవించిన ఆమె, ఇటీవల స్వామి ప్రవర్తనలో మార్పు గమనించింది. నెల క్రితం పనికి వెళ్తున్నాను అంటూ ఆమెను వదిలి తన ఇంటికి చేరిన స్వామి, తిరిగి రాకపోవడంతో అనుమానంతో బాధిత మహిళ అతని ఇంటికి వెళ్లి ప్రశ్నించింది. ఈ సందర్భంగా గ్రామ పెద్దల సమక్షంలో స్వామి, భర్తతో విడాకులు తీసుకుని వస్తే పెళ్లి చేసుకుంటాను అని మాటిచ్చాడు. ఆ మాటను నమ్మి ఆశతో ఎదురుచూస్తున్న మహిళకు మూడు రోజుల్లోనే షాక్ తగిలింది. అదే గ్రామానికి చెందిన ఓ యువతిని స్వామి పెళ్లి చేసుకోవడం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆగ్రహం బాధతో బాధిత మహిళ స్వామి ఇంటికి వెళ్లి ప్రశ్నించగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్వామి పెళ్లి చేసుకున్న యువతి కావ్య, బాధితురాలిపై కారం పొడి చల్లి దాడి చేయగా, చంద్రం, కమలతో పాటు మరికొందరు వ్యక్తులు కలిసి ఆమెను చెట్టుకు కట్టేసి రాళ్లతో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో మహిళ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి.
స్థానికులు గమనించి వెంటనే బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గ్రామంలో ఆందోళన కలిగించడమే కాకుండా మహిళల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రేమ పేరుతో నమ్మకాన్ని ద్రోహం చేసి, ఒక మహిళ జీవితాన్ని చీకటిలోకి నెట్టడం మాత్రమే కాకుండా, చివరికి ఆమెపై ఇంత దారుణంగా దాడి జరగడం హృదయ విదారకం. కుటుంబాన్ని వదిలి వచ్చిన మహిళకు న్యాయం జరగాలని స్థానికులు కోరుతున్నారు. ఘటనకు సంబంధించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.



