సిద్దిపేట కలెక్టర్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్
అక్కన్నపేటలో ఇద్దరు గల్లంతుపై ఆరా
ఎస్డీఆర్ఎఫ్ టీంలను పంపి గాలింపు చర్యలు చేపట్టాలని కోరిన కేంద్ర మంత్రి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
నిన్న రాత్రి కురిసిన వర్షానికి హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలంలోని మల్లంపల్లి చెరువులో ఇద్దరు (భార్యభర్తలు) గల్లంతయ్యారనే సమాచారం తెలుసుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొద్దిసేపటి క్రితం సిద్దిపేట జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేశారు. ఆ ఇద్దరి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇద్దరూ భార్యాభర్తలని వారి బైక్ లభ్యమైందే తప్ప ఆచూకీ తెలియలేదని కలెక్టర్ వివరించారు. వెంటనే ఎస్డీఆర్ఎఫ్ టీంలను రప్పించి గాలింపు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ విషయంలో అవసరమైతే అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. స్థానిక బీజేపీ శ్రేణులు సైతం సహాయక చర్యల్లో పాల్గొనాలని, వర్ష బాధిత ప్రాంతాల్లో పర్యటించాలని పిలుపునిచ్చారు.





