రాష్ట్ర ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు
రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
రాష్ట్ర ప్రజలకు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భోగి ,మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగి పండగ సందర్భంగా వేసే భోగి మంటలు అందరి జీవితాల్లో భోగ భాగ్యాలు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకున్నారు. మకర రాశిలోకి సూర్యుడి ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణం పుణ్యకాలమని ప్రజల జీవితాల్లో ఈ సంక్రాంతి పండుగ సుఖసంతోషాలను నింపాలని ఆకాంక్షించారు. ప్రజలు సిరి సంపదలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. సంస్కృతి సాంప్రదాయాలు పరిమళించే ఈ సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మలతో ప్రతి ఇంటా పండగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలని సూచించారు. పండగ పూట పిల్లలు పతంగులు ఎగురవేసే సమయంలో పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ లో ప్రజా పాలన ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలతో ముందుకు పోతుందని గుర్తు చేశారు.ప్రతి రైతు కుటుంబం ఆనందంగా గడుపుతున్నారని రైతులకు 2 లక్షల రుణమాఫీ పూర్తి, సన్న వడ్ల కి 500 బోనస్,రైతు భరోసా 12 వేలకు పెంచడం, ఇందిరమ్మ ఆత్మీయ కానుక ద్వారా భూమి లేని వ్యవసాయ కూలీలకు 12 వేల ఆర్థిక సహాయం, కొత్త రేషన్ కార్డులు , ఇళ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక ఈ పండగ సందర్భంగా ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా ఉంటాయని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.





