ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ చేసింది
పంటల బీమా పథకం ద్వారా పంట నష్టపోయిన వారికి నష్ట పరిహారం
రైతు రుణమాఫీ కానీ వారు ఎవరైనా ఉంటే మండల వ్యవసాయధికారిని కలిసి వివరాలు ఇవ్వాలి
హుస్నాబాద్ నియోజకవర్గ పర్యటనలో మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం హుస్నాబాద్ నియోజకవర్గం లో పర్యటించారు. తొలుత నియోజకవర్గంలోని చిగురు మామిడి, సైదాపుర్ మండలాల్లో పలు గ్రామాల్లో ఇటీవల మరణించిన వారి కుటుంబాలను, పలు ప్రమాదాలలో గాయపడిన వారిని పరామర్శించి వారి కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
అనంతరం చిగురు మామిడి మండలంలోని చిన్న ములకనూరు వెళ్తుండగా దారిలో వరి నాట్లు వేస్తున్న మహిళ రైతులతో ముచ్చటించారు. వరి నాట్లు ఎలా జరుగుతున్నాయని, వ్యవసాయ పనులు జరుగుతున్న తీరు పై ఆరా తీశారు. వ్యవసాయ పనుల్లో మహిళా రైతులు పాడిన పాటను ఆసక్తిగా గమనించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా సమస్యలను తక్షణం పరిష్కరించాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.
ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ చేసిందని ఇప్పటికే లక్ష ,లక్ష 50 వేల లోపు ఉన్న వారికి రుణమాఫీ పూర్తయిందని వారికి వెల్లడించారు. ఒక వేళ రైతు రుణమాఫీ కానీ వారు ఎవరైనా ఉంటే మండల వ్యవసాయధికారిని కలిసి వివరాలు ఇవ్వాలని రైతులకు సూచించారు. తమ ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని, గతంలో పంట నష్టపోయిన వారికి ఎలాంటి నష్ట పరిహారం వచ్చేది కాదని తెలిపారు.
