సారు అన్నం తినలేక పోతున్నాం..!బోరున విలపిస్తున్న శ్రీ చైతన్య హాస్టల్ విద్యార్థులు..

సారు అన్నం తినలేక పోతున్నాం..!బోరున విలపిస్తున్న శ్రీ చైతన్య హాస్టల్ విద్యార్థులు..

సారు అన్నం తినలేక పోతున్నాం..!
బోరున విలపిస్తున్న శ్రీ చైతన్య హాస్టల్ విద్యార్థులు..
పట్టించుకోని విద్యాధికారులు.. పర్యవేక్షణ శూన్యం..
సమస్య బయటికి రాకుండా విద్యార్థులను బెదిరిస్తున్న సిబ్బంది..

సిద్దిపేట టైమ్స్ సిద్దిపేట ప్రతినిధి:
కార్పొరేట్ విద్యాసంస్థల పేరిట వేలకు వేలు ఫీజు గుంజుతూ నాణ్యమైన ఆహారం పెట్టకపోవడంతో విద్యార్థులు బోరున విలపించిన సంఘటన సిద్దిపేట శ్రీ చైతన్య పాఠశాలకు సంబంధించిన హాస్టల్లో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. శ్రీ చైతన్య పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని ఇంటికి తీసుకుని వెళ్దామని పేరెంటు అక్కడికి వెళ్లగా అతనిని చూసిన విద్యార్థులు ఒక్కసారిగా తన వద్దకు వచ్చి అన్నం బాగాలేదని మీరైనా ఎవరికైనా చెప్పి మార్పించండి అని బోరున విలపించడంతో సమస్యను తెలుసుకొని స్థానిక జర్నలిస్టులకు సమాచారం ఇచ్చినట్లు పేరెంట్స్ తెలిపారు. విషయం తెలుసుకున్న జర్నలిస్టులు హాస్టల్ వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఏడుస్తూ అసలు హాస్టల్లో ఉండాలంటేనే భయంగా ఉందని విలపించారు. కొంతమంది విద్యార్థులు ఉడికి ఉడకని అన్నం నీళ్ల చారు తినలేక ఉపవాసం ఉంటున్నారంటే అతిశయోక్తి కాదు. విద్యార్థులు హాస్టల్లో పెట్టే తిండి తినలేక తల్లిదండ్రులకు చెప్పుకోలేక నలిగిపోతున్నామని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. విద్యార్థులు ధైర్యం  చేసి తల్లిదండ్రులకు చెప్పినా ఎవరికైనా కంప్లైంట్ చేసినా ఆ విద్యార్థి ప్రిన్సిపల్ కు,సిబ్బంది కి టార్గెట్ చేస్తారని విద్యార్థులు భయపడుతున్నారు. సాక్షాత్తు మీడియా ఎదుటనే విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేయడానికి అక్కడ ప్రిన్సిపల్ ప్రయత్నించిందంటే విద్యార్థుల పరిస్థితి తెలుసుకోవచ్చు. ఉన్నత చదువులు చదువుతారని పెద్ద పెద్ద కార్పొరేట్ పాఠశాలలని తమ పిల్లల్ని పాఠశాలల్లో చేర్పిస్తే నాణ్యమైన తిండి పెట్టక బోరుణ విలపించేలా చేస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఎప్పటికప్పుడు పరిశీలించి అనుమతులపై పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు నిమ్మకు నేరెత్తన్నట్లు వ్యవహరిస్తూ కార్పొరేట్ విద్యాసంస్థల కొమ్ముకాస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. చదువుకోమని పంపిస్తే పిల్లల ప్రాణం మీదికి వచ్చేలా ఉందని బయటికి కనిపించేంత నాణ్యత పాఠశాల హాస్టల్ లోపల ఉండటం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో  మెయిన్ రోడ్  లలో ఉన్న హాస్టల్లు విద్యాశాఖ అధికారులకు గానీ, ఫుడ్ సేఫ్టీ అధికారులకు గానీ, మున్సిపల్  అధికారులకు గానీ, ఫైర్ సిబ్బందికి గాని, ఆర్ అండ్ బి అధికారులకు గాని కనబడడం లేదా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. సమస్యపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు సమస్యలను తెలుసుకొని అధికారులు దృష్టికి తీసుకువెళ్లాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Show 1 Comment

1 Comment

  1. Vijay Kumar

    Concerned authorities దయచేసి సీరియస్ యాక్షన్ తీసుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *