రామోజీ రావు మృతి దిగ్బ్రాంతికి గురి చేసింది.
తెలుగు ప్రజలకే కాదు దేశానికి తీరని లోటు.
రామోజీరావు పార్థివ దేహానికి నివాళులు అర్పించిన హరీష్, కొత్త

సిద్దిపేట టైమ్స్, హైదరాబాద్;
రామోజీ రావు మృతి దిగ్బ్రాంతికి గురి చేసింది. తెలుగు ప్రజలకే కాదు దేశానికి తీరని లోటు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలసి రామోజీ ఫిల్మ్ సిటీలో ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా హరీష్ మాట్లాడుతూ.. సాధారణ వ్యక్తిగా ప్రారంభమైన ఆయన జీవితం అందరికీ ఆదర్శం. నిరంతర శ్రమ, నిత్యం కొత్తదనం కోసం తపన, చెదరని ఆత్మస్థైర్యం, నిబద్ధత, క్రమశిక్షణ కలగలిసిన గొప్ప వ్యక్తి ఆయన అన్నారు. తెలుగు వాడి సత్తాను యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన రామోజీరావు చిరస్మరణీయులు. పత్రిక, టీవీ, సినిమా తదితర రంగాల్లో రామోజీరావు గారు సాధించిన విజయాలు ఆయనకు మాత్రమే కాకుండా యావత్ తెలుగు జాతికి గర్వకారణం అన్నారు. అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించారు. సమాజ హితం కోసం మీడియా ద్వారా కృషి చేశారని గుర్తుచేశారు. ఏ రంగంలో అడుగుపెట్టినా.. తనదైన ముద్ర వేశారు. ప్రతి వ్యాపారంలో అగ్రగామిగా నిలిచారు. ఒక చిరుద్యోగిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన రామోజీ రావు.. వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. ఎంతో మంది కుటుంబాల్లో వెలుగు నింపారన్నారు.

తెలుగు భాషను కాపాడేందుకు ఆయన చేసి కృషి ఎంతో గొప్పదన్నారు. జర్నలిజం, సాహిత్య రంగాల్లో ఆయన చేసిన కృషి గొప్పది. సమాజ సేవ చేసి ఎంతో మంది గుండెల్లో నిలిచిపోయారన్నారు. కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి. రామోజీ రావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తునాన్నారు.