స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ..
సిద్దిపేట టైమ్స్, బ్యూరో.
స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి ఈనెల 11 వరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు స్టే విధించకపోవడంతో మార్గం సుగమమైంది. గురువారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. గత నెల 29న షెడ్యూలు ప్రకటించిన విషయం తెలిసిందే. మొదటి దశలో 2,963 ఎంపీటీసీ, 292 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. 31 జిల్లాల కలెక్టర్లు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఆ వెంటనే రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు.
నేటి నుంచి ఈనెల 11 వరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. సంగారెడ్డిలో 12 జడ్పీటీసీ, 129 ఎంపీటీసీ స్థానాలు, మెదక్ జిల్లాలో 10 జడ్పీటీసీ, 99 ఎంపీటీసీ, సిద్దిపేట జిల్లాలో 15 జడ్పీటీసీ, 125 ఎంపీటీసీ స్థానాలకు అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు. జడ్పీటీసీ నామినేషన్లను మండల పరిషత్ కార్యాలయాల్లో, ఎంపీటీసీ స్థానాలకు క్లస్టర్ స్థాయిలో స్వీకరించనున్నారు.





