హుస్నాబాద్ లో షార్ట్ సర్క్యూట్ తో లాండ్రీ దగ్ధం
రూపాయలు రెండు లక్షల మేర ఆస్తి నష్టం
ప్రభుత్వం ఆదుకోవాలని బాదితుని ఆవేదన

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో ల్యాండ్రి దగ్ధమైన సంఘటనలో షాపుతో పాటు విలువైన దుస్తులు, పట్టు చీరలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ సంఘటన హుస్నాబాద్ లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. బాధితుడు ఉప్పరపల్లి ఇస్తారి ఇచ్చిన సమాచారం మేరకు… పట్టణంలోని సిద్దిపేట రోడ్డు లో గల కోరమండల్ ఫర్టిలైజర్ పక్కన 10 ఏళ్లుగా ల్యాండ్రి షాపు నిర్వహిస్తున్నాడు. అందరికీ చిరపరిచితుడు కావడంతో ల్యాండ్రిలో అధిక మంది ఉద్యోగులు, గృహస్తులు దుస్తులు ఇస్తుంటారు. కార్తీక మాసం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో 100కి పైగా పట్టు చీరలు ఇస్త్రీ కోసం ఇచ్చారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి విద్యుత్ షార్ట్సర్క్యూట్ సంభవించడంతో దుకాణం అగ్నికి ఆహుతైంది. రాత్రి సమయంలో దుకాణం నుంచి మంటలు వస్తుండడాన్ని గమనించిన స్థానిక కౌన్సిలర్ వల్లపు రాజు, కాంగ్రెస్ నాయకులు పున్న సది, బేక్కంటి రాజయ్య, విక్రమ్, దామోదర్ బాధితునికి మరియు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న హుస్నాబాద్ అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో లక్ష రూపాయల విలువ గల దుకాణంతో పాటు అందులో ఉన్న సుమారు లక్ష రూపాయలు విలువైన వస్త్రాలు, పట్టుచీరలు అగ్నికి ఆహుతి కావడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితుడు ఇస్తారి వాపోయాడు. తన జీవనాధారమైన లాండ్రీ పై ఆధారపడి జీవిస్తున్న ఇస్తారి ని ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని రజక సంఘం అధ్యక్షుడు పున్న సారయ్య ప్రభుత్వాన్ని కోరారు.






