బీఆర్ఎస్ నుంచి కవిత బహిష్కరణ – కేసీఆర్ సంచలన నిర్ణయం..
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కుమార్తె, ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి బహిష్కరించారు. కొంత కాలంగా కవిత చేస్తున్న వ్యాఖ్యలు.. వివాదాలు తారా స్థాయి కి చేరటంతో కేసీఆర్ పార్టీ నేతలతో చర్చించి ఈ నిర్ణయం ప్రకటించారు. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు వివాదం.. సీబీఐకి కేసు అప్పగింత పైన స్పందించిన కవిత నేరుగా హరీష్, సంతోష్ పైన కీలక వ్యాఖ్యలు చేసారు. వీటిని కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నారు. పార్టీకి నష్టం చేసే విధంగా కవిత వ్యవహరించారనే కారణంతో పార్టీ నుంచి బహిష్కరణ వేటు వేసారు.
కవిత తీరుతో పార్టీకి మరింత నష్టం జరిగేలోపే ఆమెను బీఆర్ఎస్ నుంచి సాగనంపాలని నిర్ణయించారు. పార్టీ సీనియర్ నేతలతో కేసీఆర్ మంతనాలు జరిపారు. కవిత పార్టీలో ఉంటే లాభం ఉందా? అంటూ పార్టీ నేతలను కేసీఆర్ ప్రశ్నించారు. ఇంత పెద్ద వ్యాఖ్యలు చేశాక కూడా కవితను కొనసాగిస్తే పార్టీకి మరింత నష్టం అని, ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మెజారిటీ నేతలు కేసీఆర్కు సూచించారు. కవితను పార్టీలో కొనసాగితే విపక్షాలకు ఆయుధం ఇచ్చినట్లేనని నేతలు అభిప్రాయపడ్డారు. కవితపై ఎటువంటి చర్యలు తీసుకోకపోతే మున్ముందు మరింత నష్టం జరిగే ప్రమాదం ఉందని అధినేతకు చెప్పారు.
గతంలోనే కవిత కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయంటూ వ్యాఖ్యానించారు. అప్పుడే ఆమెపై నిర్ణయం తీసుకుంటారని అంతా భావించారు. అయితే, ఇప్పుడు కవిత తన వ్యాఖ్యల తీవ్రత పెంచారు. బీజేపీతో బీఆర్ఎస్ విలీనం కోసం ప్రయత్నాలు జరిగాయనే వ్యాఖ్యలను కేసీఆర్ తీవ్రంగా పరిగణించారు. తనను కలవటానికి కుమార్తె ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదు. కవిత తాజా వ్యాఖ్యల తరువాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సామాజిక మాధ్యమాల్లో కవితను వెంటనే ఆన్ఫాలో కావాలని బీఆర్ఎస్ ఐటీ విభాగం నుంచి పార్టీ శ్రేణులకు ఆదేశాలు వెళ్లాయి. సామాజిక మాధ్యమాల్లో ఆమెకు వ్యతిరేకంగా కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు. కొందరు తక్షణమే ఆమె పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక, ఇప్పుడు ఏకంగా పార్టీ నుంచి బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారు.





