గీత కార్మికులకు రక్షణగా “కాటమయ్య రక్షణ కవచం”

గీత కార్మికులకు రక్షణగా “కాటమయ్య రక్షణ కవచం”

గీత కార్మికులకు రక్షణగా “కాటమయ్య రక్షక కవచం”

తాటి చెట్టు ఎక్కే ప్రతి వ్యక్తికి కిట్ ఇస్తాం..గీత కార్మికులందరూ సద్వినియోగం చేసుకోవాలి

క్షేత్రస్థాయిలో ఇచ్చే శిక్షణలో జాప్యం జరగకూడదు

గీతా కార్మికుల కాటమయ్య రక్షణ కవచాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ ;

ఎంతోమంది గీత కార్మికులు తాటి చెట్లు ఎక్కి దురదృష్టవశాత్తు కింద పడి మరణించిన సందర్భాలు అనేకం ఉన్నాయని, వికలాంగులైన వారు కొంతమంది అయితే శాశ్వతంగా మంచాలకే పరిమితమై కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు వెళ్లదీస్తున్న గీత కార్మికులు మరికొందరని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గీత కార్మికుల రక్షణగా కాటమయ్య రక్షక కవచం తయారు చేయబడిందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం హుస్నాబాద్ పట్టణంలోని తిరుమల గార్డెన్ లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ కాటమయ్య రక్షక కవచముల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్షక కవచాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… తాటి చెట్టు పై నుండి పడి గీత కార్మికులు చనిపోకుండా ఐఐటి ఇంజనీరింగ్ విద్యార్థులు తయారుచేసిన కాటమయ్య రక్షక కవచం ప్రాణాలు రక్షించుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ కిట్ ను సీఎం దృష్టికి తీసుకుపోగా స్వయంగా అబ్దుల్లాపూర్ మెట్ లో ఎలా పని చేసే విధానం చూసి ముఖ్యమంత్రి స్వయంగా నిర్ణయం తీసుకుని దీనిని ప్రతి గీత కార్మికునికి అందజేయాలని కోరడం జరిగిందన్నారు. దీనిని క్షేత్రస్థాయిలో శిక్షణ ఇచ్చే విషయంలో ఎక్కడా జాప్యం జరగకూడదని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. అవసరమైతే ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధుల తో పాటు శాసనసభ్యుని నిధులు, పార్లమెంటు సభ్యుని నిధులను కూడా వెచ్చించి పంపిణీ చేస్తామన్నారు. గీత కార్మికులు వృత్తిలో ఉంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ భవిష్యత్తులో పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని ఆకాంక్షించారు. తాటి చెట్లు ఎత్తుగా ఉండటం వల్ల అసౌకర్యంగా ఉండడం మాట వాస్తవమేనని దీనికోసం తాటి చెట్ల ఎత్తు తక్కువగా ఉండేలా పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. అయితే రోడ్ల వెంబడి ఇతర ప్రాంతాలలో నాటే చెట్లల్లో 50% తాటి, ఈత చెట్లనే కాలువలు, రోడ్ల పక్కన, చెరువుల గట్ల పైన నాటడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కనీసం 10 మొక్కలు జన్మదిన సందర్భాలలో శుభకార్యాల సందర్భాలలో నాటి బాధ్యతను చాటుకోవాలన్నారు. తాటి చెట్ల ఈత చెట్ల పెంపకం కు గాను స్థలం ఉంటే బోర్లు వేయించే బాధ్యత కూడా తీసుకుంటానని అందుకు ప్రతిపాదనలు కూడా పంపిస్తామన్నారు. అలాగే గీత కార్మికులకు సంబంధించి పాత బకాయిలు ఉన్నట్లయితే విడుదల అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. తాటి వనానికి పోవడానికి రావడానికి ఇబ్బంది అవుతుందని ఒక గీత కార్మికుడు అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబు ఇస్తూ… ఆర్థిక ఇబ్బందులు ఉన్న కారణంగా ఇప్పుడు ఇవ్వడం సాధ్యం కాదని 2025 మార్చి తర్వాత గీత కార్మికులకు మోపెడు వాహనాలు అందిస్తామన్నారు. ప్రతి గీత కార్మికుడు వీటిని సక్రమంగా సద్వినియోగం చేసుకొని ప్రాణాలు రక్షించుకోవాలని తెలియజేశారు. అంతకుముందు ట్రైనర్ తాటి చెట్టు ఎలా ఎక్కాలో కాటమయ్య రక్షక కవచం ద్వారా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత, సిద్దిపేట గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, ఆర్డీవో రామ్మూర్తి, ఎమ్మార్వో రవీందర్ రెడ్డి, డిపిఓ, బీసీ సంక్షేమ శాఖ అధికారి, ఎక్సైజ్ సీఐ పవన్,ఎస్ఐ దామోదర్, కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *