స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కండి.. మెజారిటీ స్థానాలు మనవే..
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు ఆరూ గ్యారంటీల అమలు తీరు
ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయని బిజెపి, కాంగ్రెస్ ప్రభుత్వాలు గద్దె దిగాలి
సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త సైనికుడిలా పని చేయాలి
బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన న్యాయాన్ని, వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలి
బీఆర్ఏస్ క్యాడర్ లో బాధ్యత పెరిగేలా జోష్ నింపిన మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రసంగం..
నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమ్మేళనం విజయవంతం
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:-
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని గతంలో మాదిరిగా అన్ని స్థానాలను కైవసం చేసుకునేలా ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కంకణబద్ధులై కృషి చేయాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని, హామీల అమలులో కాలయాపన చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు గర్హనీయమని, వాగ్దానాలను అమలు చేయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే గద్దె దిగాలని సతీష్ కుమార్ డిమాండ్ చేశారు.

హుస్నాబాద్ పట్టణ శివారులోని శుభం గార్డెన్ లో శనివారం జరిగిన నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమ్మేళనంలో సతీష్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ…. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల తీరును ఎండగట్టి, వాస్తవాలను ప్రజలకు తెలియపరచాలన్నారు. 6 గ్యారంటీలు ఓ ఫెయిల్యూర్ అని, 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేటికీ అమలు చేయకుండా తాత్సరం చేయడంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటిని పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ కాలేదని, గ్యాస్ రాయితీ డబ్బులు లబ్ధిదారుల అకౌంట్లో పడటం లేదని, గృహలక్ష్మి ద్వారా ఇండ్లు కట్టించే కార్యక్రమం ఊసే లేదని, ఆసరా పెన్షన్లను ఎప్పుడు పెంచుతారని, రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఇస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఏడాది కావస్తున్న ఇంకా ఎప్పుడు ఇస్తారని ప్రజలు ఎదురుచూస్తున్నారని మండిపడ్డారు. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళా అకౌంట్లో నెలకు 2500 చొప్పున ఇస్తామన్న హామీ ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ కావాలని ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు రోధించిన రాజ్యం ఎప్పుడు బాగుపడదని, రైతులను ఇబ్బంది పెడితే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవని హెచ్చరించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు, సంక్షేమం చూసి, నాడు తట్టుకోలేక, రేవంత్ రెడ్డికి కంటగింపుగా మారి, నాడు కాంగ్రెస్ పార్టీ అసత్య ఆరోపణలు చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టించి అధికారంలోకి వచ్చి గద్దెనెక్కి తీరా ఇప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, ఇతర అంశాల మీద దృష్టి పెట్టి, స్వీయ లాభం కోసం, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న వసూళ్ల పర్వాన్ని, ప్రస్తుతం ప్రజలు వాస్తవ పరిస్థితులను గమనిస్తున్నారని, మోసపూరిత కాంగ్రెస్, బిజెపి పార్టీ నాయకుల మాటలు వినే పరిస్థితుల్లో ప్రజలు లేరని, తెలంగాణ అస్తిత్వం కోసమే పుట్టిన బీఆర్ఎస్ పార్టీకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అద్భుతమైన అఖండ విజయాన్ని అందించడానికి ప్రజలు సన్నద్ధమవుతున్నారని చెప్పారు. సోషల్ మీడియా ద్వారా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు, నాయకులు ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్యపరిచి స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీనీ గెలిపించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్లిపోయిన వాళ్లను మళ్లీ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని ఖరాకండిగా చెప్పారు. కార్యకర్తలైన నాయకులైన పార్టీ పట్టిష్టత కోసం పనిచేసినప్పుడే వారికి తగిన గుర్తింపు వస్తుందని తెలియజేశారు.

ఈ సమావేశానికి హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఎల్కతుర్తి, సైదాపూర్, కోహెడ, హుస్నాబాద్, చిగురుమామిడి, అక్కన్నపేట, భీమదేవరపల్లి మండలాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు, మండల, గ్రామ ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

