నిరుద్యోగులు, విద్యార్థి సంఘ నాయకుల అరెస్టును తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
సిద్దిపేట టైమ్స్ డెస్క్:
నిరుద్యోగులు, విద్యార్థి సంఘ నాయకులను అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. హామీలు ఇచ్చి, మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా, డిమాండ్ల సాధనే లక్ష్యంగా టీజీపీఎస్సీ వద్ద శాంతియుత నిరసన తెలియజేసేందుకు వెళ్తున్న విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధించడం హేయమైన చర్య అని మండిపడ్డారు. సోకాల్డ్ ప్రజాపాలనలో శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు కూడా నిరుద్యోగులకు లేదా? అని ప్రశ్నించారు. తమ గోసను రిప్రజెంటేషన్ ద్వారా చెప్పుకునే అవకాశం కూడా లేదా అని నిలదీశారు. ఒక వైపు ప్రజా పాలన అని ప్రచారం చేసుకుంటూ… నిరుద్యోగుల గొంతులను, హక్కులను అణగదొక్కే కుట్రలకు రేవంత్ సర్కారు పాల్పడుతరోందని ఆరోపించారు.
ఇది ముమ్మాటికీ ప్రజాపాలన కాదని.. అప్రజాస్వామ్యపాలన అని విమర్శించారు. ఉద్యోగాల కోసం పుస్తకాలు పట్టుకొని చదవాల్సిన విద్యార్థులను నడిరోడ్డుకు ఈడ్చి ధర్నాలు, ఆందోళనలు చేసే దుస్థికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖం తిప్పుకుంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. సమస్యలు పరిష్కరించే దాక, డిమాండ్లు సాధించే దాకా వదిలిపెట్టమని స్పష్టం చేశారు. విద్యార్థులు, నిరుద్యోగుల తరుపున గొంతెత్తుతామని.. నిర్వారామ పోరాటం చేస్తామన్నారు. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, నిరుద్యోగుల అరెస్టులను తక్షణం నిలిపివేయాలని, నిర్బంధించిన వారిని, అరెస్టులు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని హరీష్రావు డిమాండ్ చేశారు.