ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి – మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట టైమ్స్ డెస్క్:
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తన నివాస ఆవరణలో మొక్కలు నాటిన రాష్ట్ర రవాణా మరియు బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం మాట్లాడుతూ..రాబోయే తరాన్ని పుట్టబోయే పిల్లల్నీ ఆరోగ్యంగా రక్షించుకోవాలన్న మనం పీల్చే శ్వాస స్వచ్ఛంగా రావాలన్న ప్రతి పౌరుడు విధిగా మొక్కలు నాటి వృక్షంగా మారే విధంగా పెంచే బాధ్యత తీసుకోవాలని, రాబోయే సమాజాన్ని కాపాడడంలో మనమంతా భాగస్వామ్యం కావాలని, పిల్లలకు ప్రతి రోజు మొక్కలకు నీళ్ళు పోసే విధంగా అలవాటు చేయాలని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మనం మన పర్యావరణాన్ని రక్షించుకుంటే ఆ పర్యావరణం మనల్ని రక్షిస్తుంది. పర్యావరణాన్ని చెడగొట్టే విధంగా చెట్లు కత్తిరించడం మొక్కలు నాటకపోవడం ప్లాస్టిక్ వాడడం వల్ల ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుందని అన్నారు.
ఇప్పటికే కాలుష్యం పెరిగి క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు సంఖ్య పెరిగి మరణాల సంఖ్య పర్యావరణం కారణంగా పెరుగుతుంది. తెలంగాణ ప్రతి బిడ్డా ఈ రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపి పర్యావరణాన్ని రక్షించుకొని కలుష్యరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందామని ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేశారు.