
యుద్ధ ప్రాతిపదికన నష్టపరిహారానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి..
భారీ వర్షాలు వరదలపై సీఎంకు వివరించిన జిల్లా కలెక్టర్ రాహుల్..
సిద్దిపేట్ టైమ్స్ మెదక్ ప్రతినిధి ఆగస్టు 28

మెదక్ జిల్లాలో గురువారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి పర్యటన ఒక గంట పాటు సాగింది. సాయంత్రం ఐదు 5.20 నిమిషాలకు మెదక్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ కు సీఎం హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మొదట అధికారులతో సమీక్షించారు. అనంతరం వరద ఎఫెక్టెడ్ ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు. 6.20 కి తిరుగి ప్రయాణమయ్యారు.

భారీ వర్షాలు వరదల కారణంగా ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా తక్షణమే స్పందించాలని సహాయక చర్యలు ముమ్మరం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం అనుముల రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని అధికారులతో జిల్లాలో భారీ వర్షాలు వరదలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ఆకస్మికంగా సంభవించేవే ప్రకృతి విపత్తులు అని అటువంటి విపత్తుల సంభవించినప్పుడు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ఎటువంటి ఆస్తి నష్టం పంట నష్టం ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. యుద్ధ ప్రాతిపదికన పంట నష్టం ఆస్తి నష్టం ప్రాణనష్టాన్ని అంచనాలకు అనుగుణంగా నష్టపరిహారానికి ప్రతిపాదన సిద్ధం చేయాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. మెదక్ జిల్లాలో భారీగా వర్షాలు వరదలు ముంచేత్తుతున్న కారణంగా వాగులు చెరువులు ఉదృతంగా ప్రవహిస్తున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ లో భాగంగా వరద నష్టాలను అంచనాలు వేస్తూ శాశ్వత ప్రాతిపదికన హై లెవెల్ బ్రిడ్జి లు కట్టడానికి చర్యలు తీసుకోవాలన్నారు. పంట నష్టాన్ని అంచనా వేసినప్పుడు ఫోటో క్యాప్చర్ వీడియో క్యాప్చర్ ద్వారా జిల్లాలో జరిగిన సమగ్ర వివరాలను భద్రపరచాలని సూచించారు.
వర్షపాత నమోదు వివరాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రజలకు పలు జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు.
నానో యూరియా పై రైతులకు అవగాహన కల్పించాలి..
జిల్లాల యూరియా కొరత విషయంలో బఫర్ స్టాక్ డిస్ప్లే చేస్తూ ఉన్నామని, రైతులు రాబోవు పంటలకు కూడా ఇప్పటి నుండే యూరియా కొనుగోలు చేయడం వల్ల కొరత ఏర్పడుతుందని నానో యూరియా పై రైతులకు అవగాహన పెంపొందించాలన్నారు. చివరగా ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, పీసీసీ చీప్ మహేష్ కుమార్ గౌడ్, మెదక్ ఎంపి మాధవనేని రఘునందన్ రావు, శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావ్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, అదనపు కలెక్టర్ నగేష్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.





