సాహితీ వనంలో విరిసిన పురస్కారం..
అంజయ్య కు అవార్డు ప్రధానం..
సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట
సిద్దిపేట చెందిన కవి, సీనియర్ జర్నలిస్టు కొమురవెల్లి అంజయ్య తెలుగు సాహితీవనం జీవన సాఫల్య పురస్కారం(2024) అందుకున్నారు.హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన సంస్థ ఏడవ వార్షికోత్సవంలో ఆయనకు ఈ విశిష్ట పురస్కారాన్ని అతిథులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత లు, కవులు ఆడెపు లక్ష్మీపతి, ప్రజాశక్తి ఎడిటర్ సత్యజి, అంపశయ్య నవీన్, యండమూరి వీరేంద్రనాథ్, ఏనుగు నరసింహారెడ్డి, శాంతి కృష్ణ, సందడి అరుణ, అనురాధ, నాలేశ్వరం శంకర్, పాతూరి అన్నపూర్ణ, తోట అరుణా నాయుడు, గడ్డం శ్యామల, డాక్టర్ మౌనశ్రీ మల్లిక్, డాక్టర్ చమన్ సింగ్, బిల్లా శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గీతాయుధంతో ప్రవేశం..
గీతాయుధం కవితా సంపుటితో తెలుగు సాహిత్య వనంలో ప్రవేశించిన అంజయ్య నడక బోనం,ఆకులు రాలుతున్నయి కవిత సంపుటాలను వెలువరించారు. నాలుగు దశాబ్దాలుగా పత్రికా విలేకరిగా పనిచేశారు. మంజీరా రచయితల సంఘం అధ్యక్షునిగా పనిచేసిన ఆయన 1988 నుంచి ఉమ్మడి రాష్ట్రాల్లోని వివిధ సాహిత్య సంఘాల అవార్డులను పొందారు. రాష్ట్రస్థాయి కవితా పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచారు.