హుస్నాబాద్ లో నాటుబాంబు పేలి యువకుడికి గాయాలు
గాయపడిన యువకుడిని ఎంజీఎం కు తరలింపు
ఘటనా స్థలాన్ని సందర్శించిన హుస్నాబాద్ ఏసిపి సతీష్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ లో నాటు బాంబు పేలి ఎండి ఖలీల్ అనే యువకునికి గాయలవ్వడం స్థానికంగా కలకలం రేపింది. ఈ రోజు ఉదయం గ్రామానికి చెందిన ఖలీల్ తన పశువులను మేపేందుకు పొలం వద్దకు తీసుకువెళ్లాడు. తాళ్లతో వాటిని కట్టేసి ఉంచేందుకు భూమిలోకి మేకు కొడుతుండగా నాటు బాంబు పేలినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఖలీల్ చేతితోపాటు కాలుకు గాయాలయ్యాయి. గాయపడిన యువకుడిని 108 అంబులెన్స్ లో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని హుస్నాబాద్ ఏసిపి సతీష్ సందర్శించారు. అయితే ఈ నాటు బాంబులు అడవి పందులను వేటాడేందుకు వేటగాళ్లు పడేసినట్లు అనుమానిస్తున్నారు. నాటు బాంబులు గతంలో వేసినవా లేదా ఇటీవల వేసినావా అనేది తెలియాల్సి ఉంది.