హుస్నాబాద్ నియోజకవర్గంలో 80 ఎకరాల్లో TGIIC ఇండస్ట్రియల్ పార్కు
ఉత్సాహవంతులైన పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలి
రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం పిలుపు
వచ్చే వానాకాలం నాటికి గౌరవెల్లి ప్రాజెక్టు రెడీ
170 కోట్లతో హుస్నాబాద్ కరీంనగర్ ఫోర్ లైన్ రోడ్డు
హుస్నాబాద్ జనగామ మధ్య ఫోర్ లైన్స్ రోడ్ నిర్మాణానికి ప్రతిపాదనలు
కలెక్టరేట్లో పారిశ్రమిక వేత్తల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందేలా అక్కన్నపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్న TGIIC ఇండస్ట్రియల్ పార్కులో ఉత్సాహవంతులైన పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. మంగళవారం సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో TGIIC అధికారులు, పారిశ్రామికవేత్తలు, సంబంధిత శాఖల జిల్లా అధికారుల తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వెనుకబడిన హుస్నాబాద్ ప్రాంతంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం ద్వారా ఆ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయనే ఉద్దేశంతో అక్కన్నపేట మండల కేంద్రంలో TGIIC ద్వారా 80 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి ఇప్పటికే ప్రభుత్వం 431 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని ఆ నిధులతో కాలువలు నిర్మాణానికి చర్యలు జరుగుతున్నాయని అన్నారు. దీంతోపాటు హుస్నాబాద్ ప్రాంతంలో 640 చెరువులు ఉన్నాయని వచ్చే వానాకాలం నాటికి గౌరవెల్లి ప్రాజెక్టు నీటితో హుస్నాబాద్ ప్రాంతంలో అధిక పంటలు పండి అధిక దిగుబడులు సాధించి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి చాలా అనుకూలంగా మారుతుందని అన్నారు. అదేవిధంగా హుస్నాబాద్ ప్రాంతం కరీంనగర్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట పట్టణాలకు 30 నుండి 40 కిలోమీటర్ల లోపే ఉండడం మరియు ఇప్పటికే సిద్దిపేట ఎల్కతుర్తి మధ్య ఫోర్ లైన్స్ రోడ్డు నిర్మాణం పూర్తి కావస్తుందని, త్వరలోనే 170 కోట్లతో హుస్నాబాద్ కరీంనగర్ ఫోర్ లైన్స్ రోడ్డు నిర్మాణం చేపడతామని, హుస్నాబాద్ జనగామ మధ్య ఫోర్ లైన్స్ రోడ్ నిర్మాణానికి ప్రతిపాదనలు చేస్తున్నామని తద్వారా రవాణా సౌకర్యం సమస్య ఉండదని అన్నారు. అదేవిధంగా ఎలాంటి సమస్యలు లేని ప్రభుత్వ భూమిలో ఇండస్ట్రియల్ పార్క్ ను నిర్మిస్తున్నందున యజమానులకు ఎలాంటి ప్రాబ్లం ఉండదని అన్నారు. ఇండస్ట్రియల్ పార్కులో నీరు, రహదారులు, విద్యుత్తు, డ్రైనేజీ తదితర అన్ని సౌకర్యాలను కల్పించి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అన్ని రకాల పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటును అందించాలని కోరారు. అలాగే వర్గల్ TGIIC ఇండస్ట్రియల్ పార్కులో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.
సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఎం. మనుచౌదరి మాట్లాడుతూ… పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చేవారికి జిల్లా అధికార యంత్రాంగం తరపున పూర్తి సహకారం ఉంటుందని ఈ మధ్యన ప్రభుత్వం ప్రకటించిన MSME స్కీం ప్రోత్సాహం మరియు ఇతర ప్రభుత్వ స్కీములను ఉపయోగించుకోవచ్చని, బ్యాంకులతో సమన్వయం చేస్తామని అన్నారు. TGIIC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పవన్ కుమార్ మాట్లాడుతూ.. అక్కన్నపేటలో ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధికి ముందే మంత్రివర్యులు పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించడం ఆ ప్రాంత అభివృద్ధికి చాలా దోహదపడుతుందని, అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయడం తోపాటు పరిశ్రమల ఏర్పాటుకు డిపిఆర్ తయారు మరియు ఆన్లైన్ అప్లికేషన్ లకు సహాయం చేసేందుకు మా జోనల్ ఆఫీసర్ అందుబాటులో ఉంటారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి, సిద్దిపేట, హుస్నాబాద్ ఆర్డీవోలు సదానందం, రామ్మూర్తి, జిల్లా పరిశ్రమల అధికారి, జిల్లా మార్కెటింగ్ అధికారి, జిల్లా పౌర సరఫరాల అధికారి తదితరులు పాల్గొన్నారు.

